ముత్తుకూరు(పొదలకూరు): రెండేళ్లుగా బూడిద బల్కర్ల కారణంగా నరకయాతన అనుభవిస్తున్న ముత్తుకూరు ప్రజలకు ఊరట లభించింది. నెల్లూరు – ముత్తుకూరు, ముత్తుకూరు – పంటపాళెం మార్గాల్లో పగటివేళల్లో బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని జరిగిన చర్చల్లో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు అంగీకరించారు. భారీ లోడుతో అధిక వేగంతో ఎలాంటి సమయ నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న బల్కర్లు రోడ్లపై బూడిద దుమ్ము వెదజల్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరెందరో శాశ్వత వైకల్యానికి గురయ్యారు. బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలు కఠినతరం చేయాలని కోరుతూ టీడీపీ, బీజేపీ నాయకులు రెండు రోజులుగా నిరసన చేపట్టారు. గురువారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు, కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. పగటిపూట బూడిద బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయడానికి అంగీకరించారు.


