● కేసును ఛేదించిన కావలి రూరల్ పోలీసులు
● ముగ్గురి అరెస్ట్
కావలి రూరల్: కావలి రూరల్ మండలం తాగేటివారిపాళెంలో జరిగిన చాట్ల వాసు (32) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కావలి రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ వీవీ రమణకుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన అడవిరాజుపాళెం సర్వీస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వాసుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ జి.రాజేశ్వరరావు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీను సేకరించి పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో పథకం ప్రకారం జరిగినట్లు నిర్ధారించారు.
ఏం జరిగిందంటే..
కావలి మండలం కట్టకిందపాళెం గ్రామానికి చెందిన తుళ్లూరు జనార్దన్ వద్ద వాసు మేకలు కాసేందుకు తీసుకున్నాడు. జనార్దన్ జూలై 9వ తేదీన రాత్రి తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన మందా మధును కలిశాడు. ఈ విషయం వాసుకు తెలిసింది. గతంలో అతడికి, మధుకు మధ్య విభేదాలున్నాయి. దీంతో మేకల విషయంలో ఎందుకు కల్పించుకుంటున్నావని అదేరోజు రాత్రి గ్రామంలో మధును వాసు తిట్టాడు. దీంతో మధు అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన రవిచందుతో కలిసి పథకాన్ని రచించాడు. 10వ తేదీ ఉదయం రవిచందు.. వాసును మద్యం తాగుదామని నమ్మించి సిరి వైన్స్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించి రవిచందు మరుగుదొడ్డికి వెళ్తున్నానంటూ సమీపంలోని పొలాల వైపు వెళ్లిపోయాడు. బైక్ వద్ద వాసు ఒక్కడే ఉన్న సమయంలో వెనుక నుంచి నవీన్, గణపతి చెక్క మంచం కోడు, ఖాళీ బీరు బాటిల్తో దాడి చేసి పారిపోయారు. గాయపడిన వాసును నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్పి ంచగా చికిత్స పొందుతూ 17వ తేదీ మృతిచెందాడు. హత్య కేసులో తాగేటివారిపాళేనికి చెందిన మధు, రవిచందు, కావలి పట్టణానికి చెందిన పసుపులేటి గణపతి, కావలి మండలం గౌరవరానికి చెందిన దేవరపల్లి నవీన్పై కేసు నమోదు చేశారు. నిందితుల్లో మధు, రవిచందు, గణపతిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన మంచం కోడును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కార్యక్రమంలో కావలి రూరల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్సైలు ఎం.బాజీబాబు, తిరుమలరెడ్డి, కె.ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


