● డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్
కోవూరు: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రత్యేక తరగతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ సూచించారు. కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు – 3 డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన 1,095 మంది విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నూరుశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో తరగతులకు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ, హాజరు వివరాలు, విద్యార్థుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సోఫియా కిరణ్మయి పాల్గొన్నారు.


