● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో జలధార – జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన జిల్లాలోని వివిధ బేసిన్లు, ఉప బేసిన్లలో నీటి లభ్యతపై సమగ్ర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటికొరత ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు సమగ్ర, స్థిరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. అధిక నీరు లభ్యమయ్యే బేసిన్లను నీటి కొరత ఉన్నవాటితో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. దెబ్బతిన్న, లీకేజీ ఉన్న చెక్డ్యామ్లను పునరుద్ధరించడంతోపాటు, అనుకూల ప్రదేశాల్లో కొత్త సాగునీటి చెరువుల ఏర్పాటు సాధ్యతను పరిశీలించాలని ఆదేశించారు. చెరువుకట్టలను బలోపేతం చేస్తూ పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. కాలువల్లోని పూడికను తొలగించాలని, తూములు, కలుజుల మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దిష్ట కాలంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నాయక్, సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు.


