నెల్లూరు(లీగల్): మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో గూడూరు మండలం చవటపాళెం గ్రామానికి చెందిన దుగ్గనబోయిన సాయిశివకుమార్, ముద్దురు శరత్, సుబ్రమల్లి వినోద్ కుమార్, చల్ల లక్ష్మయ్యకు శిక్ష పడింది. జీవితఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.6 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. మానసిక వికలాంగురాలైన ఓ మహిళకు వివాహం కాలేదు. ఇంట్లో చిన్న పనులు చేస్తుంటుంది. 2020 జనవరి 5వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో సోదరుడు చెప్పడంతో ఆమె దోసెపిండి, కోడిగుడ్ల కోసం బయటకు వచ్చింది. ఒంటరిగా వెళ్తుండగా నిందితులు వెంబడించి బలవంతంగా ఊరు చివర ఉన్న ఇళ్ల మధ్యకు తీసుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి మరుసటిరోజు గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నలుగురు నిందితులతోపాటు గోవింద స్వామి వెంకటేష్పై కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో గోవింద స్వామి మృతిచెందాడు. మిగిలిన నలుగురిపై నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు.
పొదలకూరు
నిమ్మధరలు (కిలో)
పెద్దవి : రూ.140
సన్నవి : రూ.100
పండ్లు : రూ.80


