నెల్లూరు(అర్బన్): దేశంలో టీబీ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూరు రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రైవేట్ వైద్యులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా టీబీ, ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణాధికారి ఖాదర్వలీ కోరారు. జిల్లాలోని టీబీ కేసులు, వైద్య శాఖ చేపట్టిన నివారణ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ను నగరంలోని రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలిక్లినిక్లో గల సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీ నివారణే లక్ష్యంగా నూరు రోజుల కార్యక్రమాన్ని మార్చి 24న ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు సమన్వయంతో పనిచేస్తూ టీబీ కేసులను గుర్తించాలని కోరారు. రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి మందగించడం, సాయంత్రం జ్వరం రావడం లాంటి లక్షణాలున్న వారికి టీబీ పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ పరీక్షలు, వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో అనుమానిత కేసులను గవర్నమెంట్ హాస్పిటళ్లకు సిఫార్సు చేయాలని కోరారు. వ్యాధి నిర్ధారణైన వారికి పౌష్టికాహారానికి సంబంధించిన నిధులను ఖాతాలో జమ చేయనున్నారని వెల్లడించారు. పీపీఎం కో ఆర్డినేటర్ హరీష్, రామచంద్రారెడ్డి వైద్యశాల సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, డాక్టర్లు రమేష్బాబు, శ్రీనునాయక్, శైలజ, పద్మావతి, నారాయణస్వామి పాల్గొన్నారు.


