● సర్వేపల్లిలో అవినీతి కొత్త పుంతలు
● సోమిరెడ్డి అక్రమాలపై రాజీలేని పోరాటం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
వెంకటాచలం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహించిన పశువుల సంతపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహిస్తున్న పశువుల అక్రమ సంతను పరిశీలించేందుకు గానూ చలో గొలగమూడి రోడ్డు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పార్టీ నేతలు, గో ప్రేమికులతో కలిసి సంతను నిర్వహించిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డంపెట్టుకొని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తూ, ప్రజల ఛీత్కారానికి గురవుతున్నారని విమర్శించారు. నిబంధనల్లేకుండా ప్రైవేట్ స్థలంలో సంత పెట్టి అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ప్రతి నెలా అక్రమంగా వసూళ్లు
సంత నిర్వాహకుల నుంచి రూ.పది లక్షలను సోమిరెడ్డి ప్రతి నెలా అక్రమంగా వసూలు చేసి.. గోవులు, గేదెలను చైన్నె పరిసరాల్లోని వధశాలలకు తరలించడం దౌర్భాగ్యమన్నారు. గోవులను ప్రేమించే ఎంతో మంది మనోభావాలను గాయపరుస్తూ, ఇలా తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా, పంచాయతీకి ఎలాంటి సమాచారమివ్వకుండా భారీ పశువుల సంతను నిర్వహిస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. తాను కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సంతను నిర్వాహకులు ఎత్తేశారని చెప్పారు. తమ హయాంలో మనుబోలులో ప్రభుత్వ అనుమతులతో సంత నిర్వహణకు వేలం నిర్వహించిన అంశాన్ని గుర్తుచేశారు. తద్వారా పంచాయతీకి రూ.18 లక్షల నుంచి రూ.32 లక్షలు జమ కావడంతో ఆ నిధులను తాగునీటి అవసరాలకు వెచ్చించామని వివరించారు. అయితే దీనికి విరుద్ధంగా సంతను సోమిరెడ్డి ఏర్పాటు చేయించి రూ.లక్షలను దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంత నిర్వహణ ద్వారా మీరు చేసే పాపాలను లెక్కిస్తున్నామని, వీటిపై విచారణ జరిగిన రోజున భూ యజమాని బయటకొస్తారని, సంతను నిర్వహించిన వ్యక్తిని పట్టుకుంటే ఎవరెవరికి ఎంతెంత డబ్బులిచ్చారో చెప్తారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, జిల్లా నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, బాలయ్యనాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్, మందా కృష్ణ, దూడల మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


