● నేటి నుంచి నాలుగురోజుల పాటు జాతర
● తూర్పుకనుపూరులో మొదలైన సందడి
చిల్లకూరు: మండలంలోని తీరప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఏటా ఉగాదికి ముందు ముత్యాలమ్మ ఆలయానికి అనుబంధంగా ఉండే పోలేరమ్మ జాతరను దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించనున్నారు. జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ముత్యాలమ్మను దర్శించుకుని పోలేరమ్మకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. అందుకనుగుణంగా దేవదాయశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చే స్తున్నారు.
జాతర నిర్వహణ ఇలా..
ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మ జాతర మంగళవారం రాత్రి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతరలో భాగంగా తొలిరోజు పోలేరమ్మ విగ్రహాన్ని కుమ్మరి ఇంట తయారు చేసి చాకలి ఇంటికి చేర్చుతారు. అనంతరం ఘటంలోని చద్దిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి దిష్టితీర్పు చేపడుతారు. రెండోరోజు బుధవారం వేకువజామున గ్రామానికి సమీపంలో ఉన్న గంగమిట్ట మీద పోలేరమ్మను కొలువుదీర్చి భక్తులకు దర్శనం, గురునాథస్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. గురువారం యార గురునాథస్వామి గ్రామోత్సవం, గొల్లల వేడుక, ముత్యాలమ్మకు బంగారుచీర అలంకరణ, భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. శుక్రవారం పోలేరమ్మను సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


