శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 70,509 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 18,058 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.2 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
విశిష్ట సంఖ్యను
నమోదు చేసుకోండి
మర్రిపాడు: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతు విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. విశిష్ట సంఖ్య నమోదుపై మండలంలోని రామానాయుడుపల్లిలో రైతులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు, సబ్సిడీ విత్తనాలు, యూరియా, పీఎం కిసాన్ తదితరాలను పొందేందుకు ఇది తప్పనిసరని చెప్పారు. పీఎం కిసాన్ నగదు జమయ్యాక లక్ష మంది రైతులు ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ – క్రాప్ను తప్పక నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుందని తెలిపారు. కాగా విత్తనాలు సకాలంలో అందడంలేదని పలువురు రైతులు తెలియజేశారు. ఏడీ నర్సోజీరావు, జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయాఽధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
24న సైక్లింగ్
క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): అండర్ – 18 బాలబాలికల జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 24న ఉదయం ఏడు గంటలకు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ది అధికారి పాండురంగారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల సైక్లింగ్ క్రీడాకారులు www.sports.ap.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారు ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 28, మార్చి ఒకటిన నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శాప్ లీగ్ సైక్లింగ్ టోర్నీలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు. ఇతర జిల్లాల వారు నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాలనుకుంటే, ఇక్కడ చదువుతు న్న విద్యాసంస్థలకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్ను పొందుపర్చాలని కోరారు. క్రీడాకారులు తమ సొంత సైకిల్ను తెచ్చుకోవాలని, వివరాలకు 88862 28444, 95813 72472 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ధాన్యం సేకరణపై
ఉద్యోగులకు శిక్షణ
నెల్లూరు(పొగతోట): ధాన్యం సేకరణకు సంబంధించి మండల స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నామని సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వచ్చే నెల మొదటి వారంలో ధాన్యం కొతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని.. టెక్నికల్ అసిస్టెంట్లు, మండల స్థాయిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు మించి విక్రయించేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు


