ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
● వైఎస్సార్ కడప జిల్లా హవా
● భారీగా తరలివచ్చిన ప్రజలు
కొడవలూరు: మండలంలోని గండవరంలో ఉదయకాళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎడ్ల జత హవా కనబరిచింది. కడప జిల్లాకు చెందిన పెరమర్ల శివకృష్ణ జోడి ప్రథమ బహుమతిగా రూ.లక్ష గెలుచుకోగా, అదే జిల్లాకు చెందిన డి.గురివిరెడ్డి, పి.తేజస్విరెడ్డిల సంయుక్త జోడి రెండో బహుమతిగా రూ.75 వేలు, మార్తాల సుబ్బారెడ్డి జోడి మూడో బహుమతిగా రూ.50 వేలు గెలుచుకున్నాయి. నంద్యాల రోలి మేడమ్కు చెందిన ఓ జోడి నాలుగో బహుమతిగా రూ.30 వేలు, మరో జోడి ఏడో బహుమతిగా రూ.10 వేలు గెలుచుకున్నాయి. ఐదో బహుమతి ప్రకాశం జిల్లా వీరాస్వామి చౌదరి జోడి రూ.20 వేలు, ఆరో బహుమతి కడప జిల్లా గుత్తి ఆదిల్రెడ్డి జోడి రూ.15 వేలు గెలుచుకున్నాయి. విజేతలకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బహుమతుల ప్రదానం చేశారు.
ఆసక్తిగా సాగిన పోటీలు
గండవరం హైస్కూల్లో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆసక్తిగా సాగాయి. ఇక్కడ రెండో సారి పోటీలు జరిగినప్పటికీ ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు కదలకుండా చూస్తూ ఉండిపోయారు. పోటీలకు వినియోగించిన 2.100 కిలోల బండను చుండి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం కుమారుడు అమర్నాథ్రెడ్డి అందించారు. కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్థానిక నాయకులు పెనాక వెంకటేశ్వర్లురెడ్డి, ఈశ్వర్రెడ్డి, బచ్చు సురేష్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు


