యథేచ్ఛగా గుప్త నిధుల తవ్వకాలు
సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన నల్లబండ పరిసర ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన గల చేలల్లో పైభాగాన గుప్త నిధులు, పురాతన విగ్రహాలు దొరికినట్లు ప్రచారం ఉంది. ఆ ప్రాంతమంతా రాజుల కాలంలో ఎంతగానో విరాజిల్లిందని, పురాతన కాలంలో అక్కడ దేవాలయాలు ఉండేవని, నిధి నిక్షేపాలు సైతం మెండుగా భూమిలో ఉంటాయనే నమ్మకంతో గత కొంతకాలంగా పరీక్షించిన ముఠా సభ్యులు నల్లబండ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మా చేలల్లో మేము తవ్వుకుంటున్నాం, మీకేమి సంబంధం అంటూ ఎదురు దాడికి దిగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భూ యజమానికి కలలో ఆ ప్రాంతంలో గుప్త నిధులు కనిపించాయని, అందుకే అక్కడ వాటి కోసం తవ్వకాలు చేస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, చేతికి బ్లౌజులు, పలుగు, పార, సుత్తి, సమ్మెట, గోతాలు వంటి వస్తువులు అక్కడ ఉండటంతో స్థానికుల ఆరోపణలు, అనుమానాలకు బలం చేకూరుతోంది.


