పంటలు ఎండుతున్నా పట్టని ప్రభుత్వం
పొదలకూరు : రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఎండుతున్న వరి పైరును శుక్రవారం పరిశీలించిన కాకాణి మీడియాతో మాట్లాడారు. మోంథా, దిత్వా తుఫాన్లుతో ఇరిగేషన్ కాలువలు, చెరువులకు తీవ్ర నష్టం జరిగిందని, రూ.100 కోట్లు కలెక్టర్ నుంచి మంజూరు చేయించుకున్నారని తెలిపారు. అయితే రైతులను గాలికి వదిలేసి కాలువల మరమ్మతు చేపట్టలేదన్నారు. ఇరిగేషన్ శాఖలో దొంగ బిల్లులు చేయించుకుని నిధులు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్ ఉపకాలువ కింద చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి సాగునీరు అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, పంటలు ఎండిన తర్వాత నీరు ఇచ్చినా ఉపయోగం ఉండదన్నారు. కలెక్టర్ ఇబ్బడి ముబ్బడిగా జలవనరుల శాఖకు పనులు ఇవ్వడం మానుకుని క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిందిగా సూచించారు. జిల్లాలో రైతుల పంటలు ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదని, నీటి నిర్వహణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడినట్లు విమర్శించారు. రైతుల సమస్యలు కూటమి నాయకులు, అధికారులకు పట్టడం లేదని, అడ్డంగా దోచుకోవడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా వెలుగొందారన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు పేరిట దోపిడీకి పాల్పడడంతో కాలువల ద్వారా నీరు సరఫరా కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాలువలు జమ్ము, నాచుతో నిండిపోయి నీరు సరఫరా కావడం లేదన్నారు.
మరమ్మతులకు నోచుకోని
ఇరిగేషన్ కాలువలు
రూ.100 కోట్లు మంజూరైనా పనులెక్కడ చేశారు?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి


