వైఎస్సార్సీపీలోకి పెరిగిన వలసలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
● పార్టీలో పలువురి చేరిక
నెల్లూరు రూరల్: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను తట్టుకోలేక అధికారాన్ని సైతం వదులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరుతున్నారని, ఆయన చాప్టర్ క్లోజైన విషయం దీని ద్వారా అర్థమవుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం వడ్డిపాళెంలోని ఆరో వార్డు మెంబరు ఉప్పు మంజుల, రాఘవేంద్ర ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు చెందిన టీడీపీ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. సర్వేపల్లిలో వలసలు ప్రారంభం కావడంతో దిక్కుతోచక మైండ్ గేమ్కు టీడీపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి వారు ఎక్కువ కావడంతో పరువును కాపాడుకునేందుకు చూస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, సైకిల్ పార్టీని వీడి తమ పార్టీలో చేరిన వారికి యోధులుగా భావిస్తున్నామని వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ పనైపోయిందని, అధికారం ఉండటంతోనే కొందరు ఇప్పటికీ అక్కడ ఉన్నారని చెప్పారు. తాము తలుపులు తెరిస్తే అక్కడ టీడీపీ ఖాళీ అయిపోతుందని పేర్కొన్నారు. ఎంతో మంది సంప్రదింపులు జరుపుతున్నా, స్థానిక నాయకత్వం అంగీకారం మేరకే ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీలో చేరికలకు కృషి చేసిన మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యకు కృతజ్ఞతలను తెలియజేశారు.


