కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
దగదర్తి: తన తండ్రి ఆస్తులలో తనకు సక్రమంగా పంపకాలు చేయలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దుండిగం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. దుండిగం ఎస్సీ కాలనీకి చెందిన పందిళ్ల సుధాకర్ (41)కు ఆరేళ్ల క్రితం శాంతమ్మతో వివాహం జరిగింది. సుధాకర్ తండ్రి వెంకటేశ్వర్లు ఆస్తి పంపకాలు సక్రమంగా చేయకుండా కుమార్తెకు చెందేలా వ్యవహరించడంతో భార్యతో మరస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య కొద్దిరోజుల క్రితం ఆత్మకూరులోని పుట్టింటికి వెళ్లింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో మనస్తాపంతో పాటు అనారోగ్య సమస్యల వల్ల అతను గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో రేకుల షెడ్డుకు వేసిన ఇనుప పైపునకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


