నిరాశపర్చిన బడ్జెట్
● రేర్ ఎర్త్ కారిడార్ మాత్రమే ఉపయోగం
నెల్లూరు(అర్బన్): పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమీలేదు. రేర్ ఎర్త్ కారిడార్లో తీర ప్రాంతాన్ని భాగం చేయడమే కొంత మేర ప్రయోజనంగా మారింది. అధునాతన సాంకేతిక రంగాలు, రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తి, శుద్ధి, వినియోగంపై పరిశ్రమలు నెల్లూరు తీరంలో రానుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
వ్యవసాయానికి ఒరిగిందేమీ లేదు
వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులకు సంబంధించిన విషయాల్లో ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్, మరే కొత్త దానికీ అదనంగా నిధులివ్వలేదు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులను కేటాయించినా, స్వల్ప స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. ఎన్హెచ్ఎం ద్వారా సుమారు రూ.7.5 కోట్లే జిల్లాకు రానున్నాయి. విద్యకు పెద్దపీటేస్తున్నామని చెప్పినా, రూ.20 కోట్లు సైతం రావడంలేదనే విమర్శలున్నాయి. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ లేదు. పంటల గిట్టుబాటు ధరలకు సంబంధించిన ప్రయోజనాలను చేకూర్చలేదనే ఆరోపణలున్నాయి. సాగు, తాగునీటి పథకాలకు నిధులివ్వలేదు. జాతీయ రహదారులు, ఇతర మౌలిక వసతులకు రూ.50 కోట్ల వరకు రావొచ్చనే అంచనాల మినహా జిల్లాకు పెద్దగా ఒరిగిందేమీలేదనే భావన వ్యక్తమవుతోంది.
కొంత ఊరట
నెల్లూరు – ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్స్లో మోనజైట్, ఇల్మనైట్, రుటైల్ వంటి విలువైన ఖనిజాలున్నాయని భౌగోళిక అధ్యయనాలు వెల్లడించాయి. కేంద్ర నిర్ణయంతో తీర ప్రాంతాల్లో ఖనిజాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనింగ్ ప్లాంట్ల స్థాపనతో యువతకు నైపుణ్యాధారిత ఉద్యోగాలొస్తాయి. పోర్టులకు సమీపంలో ఉండటంతో ఎగుమతులకు ఆస్కారం ఉంది.


