న్యాయస్థానం కొట్టేసినా తప్పుడు రాతలా?
● అక్రమ కేసులపై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
వెంకటాచలం(పొదలకూరు): గ్రావెల్ తవ్వకాల విషయంలో మైనింగ్ శాఖ జారీ చేసిన షోకాజ్, డిమాండ్ నోటీసులను న్యాయస్థానం కొట్టివేసిందని, అస్తవ్యస్తంగా విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇచ్చిన నోటీసులకు విలువ లేదని కోర్టు స్పష్టం చేసినా పచ్చపత్రికల్లో తనపై తప్పుడు రాతలు ఏమిటని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వెంకటాచలం పార్టీ కార్యాలయంలో శనివారం కాకాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం అనుకూల పచ్చ మీడియా తనపై అసత్య కథనాలు వండి వార్చినట్లు పేర్కొన్నారు. మైనింగ్ వ్యవహారంలో తన అనుచరులు, తనకు రూ.53 కోట్ల పెనాల్టీ వేసినట్టు సోమిరెడ్డి ప్రోద్బలంతో పచ్చ పత్రికలు రాసినట్లు ఆరోపించారు. హైకోర్టు ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని ముందుగా అందించి వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో లేని కొవ్వును సృష్టించిన విధంగా కొన్ని పత్రికల్లో తనపై తప్పుడు కథనాలు రాసినట్లు మండిపడ్డారు. విజిలెన్స్ నివేదికలో చవ్వా చంద్రబాబునాయుడు గ్రావెల్ తరలించాడని స్పష్టంగా పేర్కొన్నా అతను టీడీపీకు చెందిన వాడు కావడంతో ఎలాంటి నోటీసులు అందజేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా చవ్వా చంద్రబాబునాయుడు అనే వ్యక్తే గ్రావెల్ తీసినట్టు విజిలెన్స్ ఆధారాలు ఉన్నాయని వెల్లడించినట్టు తెలిపారన్నారు. అయితే అతను తనకు అనుచరుడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నాడని.. అతడిని నేను చూసినట్టుగా, కలసినట్టుగా ఆధారాలు లేవని.. సోమిరెడ్డితో రాసుకుపూసుకు తిరుగుతుంటాడనే ఆధారాలు ఉన్నాయన్నారు.
సోమిరెడ్డికే చంద్రబాబు అనుచరుడు
2014 నుంచి 2019 వరకు సోమిరెడ్డి ఎమ్మెల్సీగా, మంత్రిగా దోచుకున్న గ్రావెల్ గుంతలు చూపించి చవ్వా చంద్రబాబునాయుడు నా అనుచరుడని తమ పార్టీ నాయకుల పేర్లు చేర్చి గ్రావెల్ తరలించిన చంద్రబాబునాయుడు పేరు విజిలెన్స్ నివేదికలో లేకుండా చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు. అధికారులు ఉద్దేశపూర్వంగా చేసిన దారుణాలను కోర్టు కొట్టివేసిందని, హైకోర్టు తీర్పు తప్పుడు కేసులు పెట్టిన వారికి చెంపపెట్టుగా పేర్కొన్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని ఎవరికి రూ.53 కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని, ఎన్ని దొంగ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. సోమిరెడ్డి ఆరోపణలు మాత్రమే చేస్తాడని, మేము ఆధారాలను కూడా చూపెడుతామన్నారు. ఇసుక రీచ్లలో స్కానర్లు పెట్టి దోచుకుంటున్న వైనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన వైనాన్ని గుర్తుచేశారు. సోమిరెడ్డి పెట్టే దొంగ కేసులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరన్నారు. గ్రావెల్పై వారు పెట్టిన దొంగ కేసులో కోర్టు షోకాజ్, డిమాండ్ నోటీసులు చూసిన వెంటనే కొట్టి వేసిందంటే సోమిరెడ్డికి అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదని విమర్శించారు. పచ్చపత్రికలు ఏమి రాసినా భయపడే ప్రసక్తే లేదని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు మందల వెంకటశేషయ్య, కోదండరామిరెడ్డి, రఘునందన్రెడ్డి, మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.


