నంద్యాల ప్రమాదంలో సంగం వాసికి గాయాలు
సంగం: నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగం మండలం పెరమన గ్రామానికి చెందిన ఓ యువకుడికి తీవ్ర గాయాలైంది. వివరాల మేరకు.. పెరమన గ్రామానికి చెందిన పి.బాబు కుమారుడు పి.హరీష్ సినిమా ఫీల్డ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన హరీష్ అనంతరం హైదరాబాద్కు వెళ్లేందుకు బుధవారం పెరమన వద్ద బస్సు ఎక్కాడు. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరీష్కు గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబసభ్యులు నంద్యాలకు బయలుదేరారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి (38) మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ ఏబీఎం కాంపౌడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు అనారోగ్యంతో మృతి చెందాడా? లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
మనుబోలు: మనుబోలులో విలువైన రేషన్ బియ్యాన్ని గురువారం సివిల్ సప్లయ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని పొదలకూరు గోడౌన్కు తరలించారు. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని బడా దోస్త్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బడా దోస్త్ వాహనంలో ఉన్న 96 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్సై శివరాకేష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,64,040 ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని సీఎస్ డీటీ ఐ.రవి స్వాధీనం చేసుకుని పొదలకూరు గోడౌన్కు అప్పగించారు. ఆయన వెంట వీఆర్వో నాగార్జున రెడ్డి ఉన్నారు.
ఎర్రచందనం దుంగల స్వాధీనం
● నలుగురి అరెస్టు
● కారు, ద్విచక్రవాహనం సీజ్
తిరుపతి అన్నమయ్య సర్కిల్: నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ప్లాజా వద్ద గురువారం అక్రమంగా కారులో తరలిస్తున్న 28 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దుంగలు తరలిస్తున్న కారును, పైలట్ వాహనంగా వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. రైల్వేకోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద టీమ్, స్థానిక ఎఫ్బీఓ ఆదిశేషయ్యతో కలిసి నెల్లూరు–గూడూరు మార్గంలో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. వెంకటాచలం టోల్ప్లాజా వద్దకు చేరుకోగా, ఒక మోటారు సైకిల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారితో పాటు వెనకే వస్తున్న ఒక కారును అడ్డగించి నిలిపారు. కారును ఆపిన వెంటనే అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కారులో తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు లభించాయి. ఆ నలుగురు వ్యక్తులను నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. దుంగలతో సహా తిరుపతి టాస్క్ఫోర్సు పోలీస్స్టేషన్కు తరలించారు. డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జెడ్పీ హైస్కూల్లో కేంద్ర బృందం
కోట: స్థానిక ఏవీకేఆర్ జెడ్పీ హైస్కూల్ను ఎన్సీఈఆర్టీ బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మనోదర్పన్ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్లు గిరితేజ్కుమార్ యాదవ్, దీప, లక్ష్మీనరసింహ తదితరులు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 9, 10, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులతో మాట్లాడారు. మొత్తం 84 అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల స్థితిగతులు, పాఠశాల స్థాయి మొదలగు వాటిపై వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కరుణాకర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.34 సన్నవి: రూ.20
పండ్లు: రూ.10
నంద్యాల ప్రమాదంలో సంగం వాసికి గాయాలు


