నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● జిల్లా వ్యాప్తంగా
కొనసాగుతున్న కార్డన్ సెర్చ్లు
నెల్లూరు(క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల పటిష్ట చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శివారు ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటుగా పత్రాలు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం తెల్లవారుజామున జిల్లాలోని చిల్లకూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం, ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పాములవీధి, నెల్లూరు సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పరపాళెంలో పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించి 55 బైక్లు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
తెల్లవారుజాము నుంచే..
నెల్లూరు నగర డీఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నగర ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంతపేటలోని ఉప్పరపాళేన్ని నాలుగు వైపుల నుంచి చట్టుముట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంట్లోని వారి ఆధార్ కార్డులను పరిశీలించి ఎంతకాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు.. తదితర వివరాలను సేకరించారు. రికార్డులు సరిగాలేని 20 బైక్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ నేరనియంత్రణే లక్ష్యంగా చేస్తున్న కార్డన్ సెర్చ్కు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ఇన్స్పెక్టర్లు వైవీ సోమయ్య, చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి


