గుట్టుచప్పుడు కాకుండా జామాయిల్‌ కర్ర అమ్మకం | - | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా జామాయిల్‌ కర్ర అమ్మకం

Jun 10 2025 6:54 AM | Updated on Jun 10 2025 7:20 AM

-

శకునాలపల్లి ఎఫ్బీఓ నిర్వాకం

 గుట్టురట్టు చేసిన వీఎస్సెస్‌ కమిటీ సభ్యులు

ఉదయగిరి: కంచె చేను మేసిన చందంగా మారింది అటవీ శాఖ తీరు. అందులోని ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా దోచేసి తమ జేబులు నింపుకొంటూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఉదయగిరి రేంజ్‌ పరిధిలో కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇదే అదునుగా ఇంటి దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమార్కులకు ఆ శాఖలో పనిచేసే అధికారుల అండదండలుండటంతో అవినీతి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. కొంతమంది వీఎస్సెస్‌ సభ్యులు ధైర్యం చేసి ఓ అధికారి అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. దీన్ని తొక్కిపెట్టేందుకు యత్నించినా, అదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగి రాజీకి అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు విచారణ జరుపుతున్నారు.

జరగాల్సిందిలా..
ఉదయగిరి అటవీ రేంజ్‌ పరిధిలోని ఉదయగిరి వెస్ట్‌ బీట్‌లో గల శకునాలపల్లిలో 20 హెక్టార్లల్లో జామాయిల్‌ను వీఎస్సెస్‌ కమిటీ పర్యవేక్షణలో కొన్నేళ్ల క్రితం నాటారు. వీటిని కమిటీలు సంరక్షించసాగాయి. అయితే ఇటీవల మొక్కలు పెద్దవి కావడంతో కటింగ్‌కు వచ్చాయి. వేలం ద్వారా విక్రయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. టన్నును రూ.8100కు కొనుగోలు చేసేందుకు ఒక సంస్ధ ముందుకొచ్చింది. చెట్లు నరికి ఆ ధర లెక్కన విక్రయించి నగదును ఖజానాకు జమ చేస్తారు. నరకడం.. లారీల్లో లోడ్‌ చేయడం.. ఎన్ని టన్నులున్నాయనే వివరాల నమోదు.. వాటికి పర్మిట్ల జారీ.. అక్రమాలు జరగకుండా అన్ని జాగ్రత్తలను ఆ బీట్‌లో విధులు నిర్వర్తించే ఫారెస్ట్‌ ఆధికారి, ఎఫ్బీఓ పాటించాలి.

అక్రమాలకు పాల్పడిన ఎఫ్బీఓ
శకునాలపల్లి ఎఫ్బీఓ భానుతేజ గుట్టుచప్పుడు కాకుండా కొంతమేర జామాయిల్‌ను నరికించారు. తనకు అనుకూలమైన వ్యక్తి ద్వారా రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా దొంగచాటుగా తరలించి బద్వేల్‌ సమీపంలోని ఓ కంపెనీలో విక్రయించారు. విషయం తెలుసుకున్న వీఎస్సెస్‌ కమిటీ సభ్యులు సదరు ఎఫ్బీఓ నిర్వాకాన్ని ఫారెస్ట్‌ అధికారి చినవెంకటయ్యకు ఈ నెల నాలుగున తెలియజేశారు. దీంతో భానుతేజను సదరు అధికారి ప్రశ్నించగా, వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన తన మెడకెక్కడ చుట్టుకుంటుందోననే భయంతో కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సదరు ఫారెస్ట్‌ ఆధికారి విషయాన్ని రేంజర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

కుదరని సంధి
ఈ క్రమంలో రాజీ కుదిర్చేందుకు ఆ శాఖలో పనిచేసే భానుతేజ అనుచరులు యత్నించారు. అయితే వ్యవహారం వీఎస్సెస్‌ సభ్యులకు తెలియడంతో, నేరుగా వారు డీఎఫ్‌ఓ, ఉన్నతాధిధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధిలేక దుత్తలూరు డీఆర్వోను విచారణాధికారిగా రేంజర్‌ నియమించారు. ఇందులో వాస్తవాలు వెలుగుచూశాయి. అయినా ఘటన తీవ్రతను తగ్గించి తూతూమంత్రంగా నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపేందుకు యత్నిస్తున్నారని వీఎస్సెస్‌ సభ్యులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కార్యాలయంలో విచారణ 
వీఎస్సెస్‌ సభ్యులు, అక్రమాలకు పాల్పడిన తేజ, కర్రను ట్రాక్టర్‌ ద్వారా తరలించిన దేవమ్మ చెరువుకు చెందిన సుబ్బారాయుడ్ని స్థానిక అటవీ రేంజ్‌ కార్యాలయంలో రేంజర్‌ కుమార్‌రాజా సోమవారం విచారించారు. అక్రమాలు జరిగాయనే అంశాన్ని తేల్చి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. గతంలోనూ రూ.లక్షల విలువజేసే అటవీ సంపద ఇంటి దొంగలే కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై రేంజర్‌ను సాక్షి సంప్రదించగా, అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement