
అప్పుల బాధ తాళలేక..
● యువకుడి ఆత్మహత్య
ఇందుకూరుపేట: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండంలోని కొరుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొరుటూరుపాళేనికి చెందిన ముత్యాల మనోహర్ (29)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను వివిధ కారణాలతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం సముద్రం ఒడ్డున పురుగు మందు తాగాడు. కొంతసేపటికి భయపడిన మనోహర్ తాను ఆత్మహత్యకు యత్నించానని నోటి నుంచి నురగలు కక్కుకొంటూ అటుగా వెళ్తున్న స్థానికులకు చెప్పాడు. దీంతో వారు చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం చనిపోయాడు. కేసు నమోదు చేసిన ఎస్సై నాగార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
2,613 పాఠశాలల్లో కిట్స్ పంపిణీ
నెల్లూరు(టౌన్): విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా జిల్లాలోని 2,613 ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ కిట్స్ను పంపిణీ చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఏపీసీ చేతుల మీదుగా కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడతలో ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీలు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్బాబు, సీఎంఓ పెంచలయ్య, ఏపీఓ ప్రసాద్, ఎంఈఓ మురళీధర్, స్కూల్ హెచ్ఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ నేడు
నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. రేపటి నుంచి రెగ్యులర్ ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ,) న్యాయమూర్తి సరస్వతి కోర్టుకు హాజరు అవుతున్నందున ఇన్చార్జి కోర్టు న్యాయమూర్తి సుమ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

అప్పుల బాధ తాళలేక..