
కారు అద్దాలు పగులగొట్టి..
● రూ.8.90 లక్షల చోరీ
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజి స్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన అనుమసముద్రంపేట గ్రామానికి చెందిన చిలకపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి రూ.8.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎస్సై జిలానీ కథనం మేరకు.. రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన బాధితులు కారులో నగదు ఉంచి తాళాలు వేసి కార్యాలయంలోకి వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు కారు అద్దాలు పగులగొట్టి బ్యాగ్లోని నగదును అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.