కలెక్టర్‌ సారూ.. దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సారూ.. దృష్టి పెట్టండి

Jun 14 2025 10:08 AM | Updated on Jun 14 2025 10:08 AM

కలెక్

కలెక్టర్‌ సారూ.. దృష్టి పెట్టండి

అనుమతులు లేకున్నా..

జిల్లాలో గ్రావెల్‌ మాఫియా బరితెగించింది. కావలి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, ఉదయగిరి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రధానంగా దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి మండలాల్లో చెరువులతోపాటు ప్రభుత్వ భూముల్లో రేయింబవళ్లు వందలాది యంత్రాలు పెట్టి వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వెంకటాచలం మండలం నాగబోట్లకండ్రికలో అయితే ఒక ఉద్యమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. ఆ అక్రమార్కులకు మైనింగ్‌ కార్యాలయం నుంచి పూర్తి సహకారం అందిస్తూ అందుకు నజరాలు అందుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

అనుమతులతో పనిలేకుండానే విచ్చలవిడిగా మైనింగ్‌

పర్మిట్లు లేకుండానే తరలివెళ్తున్న

క్వార్ట్‌ ్జ మెటల్‌

పెన్నాను కుళ్లపొడుస్తున్నా

పట్టించుకోని వైనం

చెరువులు, ప్రభుత్వ భూముల్లో

గ్రావెల్‌ దోపిడీ

జిల్లాలో దాదాపు 13 కంకర క్వారీలున్నాయి. నాలుగేళ్లుగా పర్మిట్లు రిలీజ్‌ చేయలేదు. అయినా కంకర క్వారీలు యథేచ్ఛగా నడిపిస్తున్నారు. పర్మిట్లు లేకుండానే జిల్లాలో జరిగే అభివృద్ధి పనులకు నిత్యం వందల టిప్పర్లలో కంకర తరలివెళ్తోంది. కానీ మైనింగ్‌ అధికారులు క్వారీలపై ఎన్నడూ కూడా దాడులు చేసి అక్రమ రవాణాను అడ్డుకున్న ఉదంతాలు ఏడాది కాలంలో ఎక్కడా జరగలేదు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో పెన్నా గర్భం ఇసుక అక్రమ తవ్వకాలతో శోకిస్తోంది. మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలతో భూతల్లి గుండెకోతకు గురవుతోంది. మైకా, క్వార్ట్‌ ్జమెటల్‌ అక్రమ మైనింగ్‌తో భూగర్భం రోదిస్తోంది. కూటమి నేతలు సహజ వనరులను దోపిడీ చేసేందుకు తమకు అనుకూలంగా ఉండేందుకు పక్క జిల్లాలో ఏడీ స్థాయి అధికారిని జిల్లాలో ఇన్‌చార్జి డీడీ సీట్లో కూర్చోబెట్టారు. దీంతో అధికార పార్టీ నేతల దోపిడీకి, అక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూ విశ్వాసం చూపిస్తూ స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడు. ప్రభుత్వం ఏర్పాటుతోనే మైనింగ్‌ శాఖ అధికారిగా చంద్రశేఖర్‌ బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన కూటమి నేతల ఆజ్ఞానుసారంగా పనిచేయకపోవడంతో ఆయన్ను చిన్న కారణం చూపించి కలెక్టర్‌తో ప్రభుత్వానికి సరెండర్‌ చేయించారు. అప్పటి నుంచి ఆ స్థానంలోకి ఫుల్‌చార్జి అధికారిని రానివ్వకుండా ఇన్‌చార్జి పేరుతో ఈ అవినీతి అధికారిని ఆ సీట్లో కూర్చోబెట్టి కూటమి నేతలు తమ కార్యకలాపాలు సాగించుకుంటున్నారు. సైదాపురంలో గనుల లీజుల వ్యవహారంలో తాము చెప్పినట్టే తలాడిస్తాడని తిరుపతి జిల్లా మైనింగ్‌ శాఖలో ఏడీ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన్ను తీసుకువచ్చి నెల్లూరు జిల్లా డీడీ స్థానంలో ఇన్‌చార్జిగా అధికారం కట్టబెట్టి కూర్చోబెట్టారు. గత ప్రభుత్వంలో ఆయన జిల్లా మైనింగ్‌ శాఖ విజిలెన్స్‌ వింగ్‌లో పనిచేశారు. లీజుల వ్యవహారం నుంచి అన్నింటిపై అవగాహన ఉండడంతోపాటు కూటమి నేతల కనుసన్నల్లోనే బాధ్యతలు నిర్వహించేలా ఒప్పందంతో తీసుకువచ్చి ఈ సీటులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ఆయన కూటమి నేతల అండతో చెలరేగిపోతున్నాడు. మైనింగ్‌శాఖ కార్యాలయాన్ని కూటమి నేతల ప్రైవేట్‌ అడ్డాగా మార్చేశాడు.

గత ప్రభుత్వం పెనాల్టీలను బూచిగా చూపి..

జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వార్ట్‌ ్జ గనుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో గత ప్రభుత్వం దాదాపు 30 మైన్స్‌కు రూ.250 కోట్ల వరకు పెనాల్టీలు విధించింది. ఆయా పెనాల్టీలను సాకుగా క్వార్ట్‌ ్జ మైన్స్‌ యజమానులతో బేరసారాలు నడిపి వసూళ్లు చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. పాత క్వార్ట్‌ ్జ గనులకు లీజుల పునరుద్ధరణ, పర్మిట్ల రిలీజ్‌కు కూడా రూ.కోట్లల్లో చేతులు మారుతున్నాయని సమాచారం ఉంది.

గ్రావెల్‌ దందాకు సహకారం

సహజ వనరులు దోచిపెడుతూ.. కాసులు పిండుకుంటున్న అధికారి

ఇసుక దందాలో..

జిల్లాలో ఉచిత ఇసుక విధానం ముసుగులో దందా నడుస్తోంది. పెన్నానదిని అడుగడుగునా కుళ్లబొడుస్తున్నారు. అనధికారికంగా ఓపెన్‌ రీచ్‌ల పేరుతో భారీ యంత్రాలతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతోంది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా.. మీడియాలో కథనాలు వస్తున్నా.. మైనింగ్‌ అధికారిగా ఆ వైపే కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్‌ శాఖ అధికారిక లెక్కల ప్రకారం స్టాక్‌ యార్డుల్లో ఇసుక మాయం అవుతున్నా.. ఆ లెక్కలు అడిగే దిక్కులేకుండా పోయింది. పర్యావరణ నిబంధనల మేరకు జూన్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకాలు నిలిపి వేశారు. ప్రజా అవసరాల కోసమని ఎనిమిది యార్డుల్లో 2.19 లక్షల టన్నుల ఇసుక ఉంచినట్లు అధికారిక గణాంకాలు చూపిస్తున్నారు. వాస్తవంగా అందులో లక్ష టన్నుల కూడా లేదు. అధికారికంగా పెన్నానదిలో ఇసుక తవ్వకాలు ఆపేసినట్లు చెబుతున్నా.. రాత్రి వేళల్లో నది నుంచే లోడింగ్‌ చేస్తున్నారు. ఇవన్నీ మైనింగ్‌ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపారన్న ఆరోపణలున్నాయి..

ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి..

జిల్లా మైనింగ్‌ శాఖలో ఓ అక్రమార్కుడు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే స్థాయిలో చెలరేగిపోతున్నాడు. మట్టి నుంచి మైకా వరకు, ఇసుక నుంచి క్వార్ట్‌ ్జ వరకు కూటమి నేతలకు దోచిపెడుతూ తన జేబులు నింపుకుంటున్నాడు. జిల్లాకు సూపర్‌ బాస్‌ కలెక్టర్‌ అయితే.. అంతకు మించిన అధికారాన్ని చెలాయిస్తున్నాడు. అక్రమ మైనింగ్‌కు, పర్మిట్లు లేకుండానే క్వార్ట్‌ ్జ మెటల్‌ను విదేశాలకు తరలించేందుకు అధికార పార్టీ నేతల పట్ల విశ్వాసంగా ఉంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సహజ వనరుల దోపిడీపై మీడియా ఘోషిస్తున్నా.. ధ్రుతరాష్టుడి పాత్ర పోషిస్తున్నాడు.

అత్యధిక ఆదాయం వచ్చే శాఖలో మైనింగ్‌ ఒకటి. కానీ ఆ శాఖకు పట్టిన అవినీతి చెద ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి సొంత ఆదాయం పెంచుకుంటోంది. బినామీ పేర్లతో రూ.కోట్లల్లో ఆస్తులు పెంచుకుంటున్నారు. అవినీతి భరతం పడతామంటూ బీరాలు పలికే అవినీతి నిరోధక శాఖ సైతం ఇటువంటి అవినీతి పరుల వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. ఈ శాఖలో పనిచేసే ఏ అధికారిపై కొన్నేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఏసీబీ శాఖ పనితీరును ప్రశ్నిస్తోంది.

కూటమి ప్రభుత్వంలో జిల్లా పరిపాలనాధికారులు సైతం నేతల కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తోంది. జిల్లాకే బాస్‌ అయిన కలెక్టర్‌ కూడా మైనింగ్‌ అక్రమాలు తెలిసీ మౌనంగా ఉంటున్నారు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు బాధ్యతలు విస్మరిస్తే... రేపు వారి మెడకే చుట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికై నా మైనింగ్‌శాఖలో జరిగే అవినీతికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్‌ను జిల్లా ప్రజానీకం కోరుతోంది.

కలెక్టర్‌ సారూ.. దృష్టి పెట్టండి 
1
1/1

కలెక్టర్‌ సారూ.. దృష్టి పెట్టండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement