
రూ.4.50 కోట్లతో ఉడాయింపు
● పరారీలో డ్రైవర్, గుమస్తా
● జీపీఎస్ కట్ అవడంతో
అనుమానించిన వ్యాపారి
● వ్యాపారి ఫిర్యాదుతో
రంగంలోకి దిగిన పోలీసులు
● అదుపులో నలుగురు అనుమానితులు?
● రూ.కోట్లల్లో రికవరీ
మర్రిపాడు: కారులో తరలిస్తున్న రూ.4.50 కోట్లతో కొందరు ఉడాయించారు. ఈ ఘటన శుక్రవారం మర్రిపాడు సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దాదాపు రూ.3 కోట్లకుపైగా రికవరీ చేసినట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.కోట్లల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఢిల్లీలో రూ.4.5 కోట్ల నగదును తన కారు డ్రైవర్, గుమస్తాకు ఇచ్చి చైన్నెలో అందజేయాలని సూచించారు. దీంతో కారు డ్రైవర్, గుమస్తా నగదుతో చైన్నెకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, కర్నూలు మీదుగా చైన్నెకు వెళ్లాల్సి ఉంది. కారుకు జీపీఎస్ ఏర్పాటు చేసి ఉండడంతో ప్రతి క్షణం కారును పర్యవేక్షిస్తున్నారు. అయితే డ్రైవర్ రూట్ మార్చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీపంలోని పెద్దపోలుకుంట మీదుగా మర్రిపాడు మండలం సింగనపల్లి వద్దకు వచ్చే సరికి సిగ్నల్ కట్ అయింది. దీంతో సదరు వ్యాపారి కారు డ్రైవర్కు, గుమస్తాకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్లో ఉండడంతో ఆయన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు బాట వద్ద వ్యాపారికి చెందిన కియో కారును స్వాధీనం చేసుకుని మర్రిపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. వ్యాపారి హుటాహుటిన మర్రిపాడు పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
పథకం ప్రకారమే నగదు దోపిడీ?
కారు డ్రైవర్ పథకం ప్రకారం స్నేహితులతో కలిసి నగదు కాజేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్నామని డ్రైవర్ ఎప్పటికప్పుడు తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వారందరూ కలిసి నగదు కాజేసి కారును అక్కడే వదిలి పరారయ్యారు. అయితే వారికి ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో పోలీసులకు దొరికినట్లు సమాచారం. అతనిచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3 కోట్లపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసు అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. మొత్తం మీద గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు చేధించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.