
బాతులు మేపేందుకు చిన్నారుల కిడ్నాప్
● మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
నెల్లూరు(క్రైమ్): బాతులు మేపేందుకు ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళను నెల్లూరు నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన కె.శీనమ్మ, కృష్ణ దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె చంద్రమ్మ, కుమారుడు సూర్య అనే పిల్లలున్నారు. ఈనెల 8వ తేదీన శీనమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని మైపాడు బీచ్కు వెళ్లింది. మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి తిరిగి నెల్లూరుకు చేరుకున్నారు. శెట్టిగుంటరోడ్డు వద్ద ఆటో కోసం వేచి ఉండగా చిన్నారులు అదృశ్యమయ్యారు. బాధిత తల్లి గాలించగా జాడ తెలియకపోవడంతో నవాబుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చిన్నారులను తీసుకెళ్లింది కావలికి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన పి.జాలమ్మగా గుర్తించారు. శుక్రవారం కావలి జేబీ కాలేజ్గేటు వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారులను సంరక్షించారు. అనంతరం ఆమెను స్టేషన్కు తరలించి విచారించగా బాతులు మేపేందుకు చిన్నారులను తీసుకెళ్లినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చిన్నారులను బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది బీవీ నరసయ్య, ఎన్.ప్రసాద్, ఆర్వీ రత్నయ్య, టి.మస్తాన్రావు, ఎం.వేణు, జి.మస్తానయ్య, ఎస్కే గౌస్బాషాలను ఎస్పీ అభినందించారు.