
డీలర్ టు మిల్లర్
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
● కోవూరు అడ్డాగా
చెలరేగుతున్న రేషన్ మాఫియా
● జిల్లా వ్యాప్తంగా నెలకు 9 వేల
మెట్రిక్ టన్నుల అక్రమ రవాణా
● బుచ్చిరెడ్డిపాళెం, చంద్రశేఖరపురం రైస్మిల్లుల్లో నెలకు 2 వేల
టన్నులు రీపాలిష్
● చైన్నె మార్కెట్తోపాటు పోర్టుల ద్వారా విదేశాలకు తరలింపు
● షాడో ఎమ్మెల్యేకు వాటాగా
నెలకు రూ.10 లక్షలు
● పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్
అధికారులకు మామూళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గం అన్ని రకాల మాఫియాలకు అడ్డాగా మారింది. సహజ వనరుల దోపిడీ నుంచి పేదల బియ్యం వరకు షాడో ఎమ్మెల్యేల కనుసన్నలో మాఫియా గాళ్లు దోచుకుంటున్నారు. ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్ మాఫియాలతోపాటు బుచ్చిరెడ్డిపాళెం, చంద్రశేఖరపురం, నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డు కేంద్రాలుగా రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతుంది. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న రైస్మిల్లుల్లో రీపాలిష్ చేసి చైన్నె మార్కెట్కు తరలించి రూ.కోట్లు గడిస్తోంది. అందుకు నజరాగా మాఫియా నెలనెలా వాటాలు పంచుతున్నారు.
నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యేకు కీలక అనుచరుడిగా, షాడో ఎమ్మెల్యేగా ఉంటూ రేషన్ మాఫియాకు రింగ్లీడర్గా వ్యవహరిస్తున్నాడు. స్మగ్లర్తోపాటు మరో ఇద్దరు కలిసి రేషన్ బియ్యం దందాకు తెరతీశారు. కోవూరుతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు ఓ ప్రత్యేక ముఠానే తయారు చేశాడు. డీలర్లతో కుమ్మకై ్క వారి నుంచి కేజీ రూ.16 వంతున కొనుగోలు చేసి బుచ్చిరెడ్డిపాళెంలోని నాగామాంబపురం విలియన్స్పేటలో ఉన్న ఓ రైస్ మిల్లు, కొడవలూరు మండలంలోని రాజుపాళెం, చంద్రశేఖరపురంలో ఉన్న రైస్ మిల్లులకు, నెల్లూరు సిటీలోని శెట్టిగుంటరోడ్డు రైస్మిల్లుకు చేర్చి అక్కడ పాలిష్ పట్టించి బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి తమిళనాడు మార్కెట్కు తరలిస్తున్నారు.
నెలకు 2 వేల మెట్రిక్ టన్నుల వ్యాపారం
జిల్లాలో మొత్తంగా నెలకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే.. అందులో ఒక్క కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వ్యాపారం జరుగుతుందంటే ఇక్కడి రేషన్ మాఫియా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంతోపాటు సమీపం నియోజకవర్గాల మండలాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు పాలిష్ పట్టించి రీసైక్లింగ్ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ నడుస్తోంది. ఆయా మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిష్ పట్టడం తప్ప.. ధాన్యం కొనుగోలు చేసి మరపడుతున్నట్లు రికార్డుల్లేవు. ఆయా మిల్లులకు ప్రతి నెలా వేలల్లో వచ్చే కరెంట్ బిల్లులే రేషన్బియ్యం పాలిష్ పడుతున్నారనే దానికి అద్దం పడుతోంది.
షాడో ఎమ్మెల్యేకు నెలకు రూ.10 లక్షలు
రేషన్ మాఫియా నెలకు రూ.కోట్లల్లో సంపాదిస్తుంటే.. షాడో ఎమ్మెల్యేకు నెలకు రూ.10 లక్షల వాటాలుగా ఇస్తున్నారనే సమాచారం. ఇక పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు ఇచ్చుకుంటూ పోతుండడంతో ఎవరిపైనా చర్యలు తీసుకుంటున్న దాఖాలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం
● జలదంకి మండలం చామదలకు చెందిన డీలర్లు వెంకటసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి దుకాణాల నుంచి గత మంగళవారం అర్ధరాత్రి 11 బస్తాల బియ్యం అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ జరిగిన అసలు ట్విస్ట్ ఏమిటంటే.. మరో లారీలో భారీగా రేషన్ బియ్యాన్ని ఇంకో రూట్లో తరలించడమే.
● కొడవలూరు మండలం చంద్రశేఖర్పురం వద్ద లక్ష్మీ నరసింహస్వామి రైస్మిల్లులో వారం రోజుల కిందట రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా పౌరసరఫరా శాఖ డీటీ సారంగపాణి పట్టుకున్నారు. 32 టన్నుల రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి చైన్నె మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా జరిగే రేషన్ దందాలో కోవూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తోంది. కోవూరు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసి, డీలర్లకు కట్టబెట్టిన పదమూడు రోజుల్లో నాలుగు చోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలు పట్టుబడ్డాయి. దొరకకుండా తప్పించుకున్న వాహనాలైతే లెక్కే లేదు. ఏ దుకాణం నుంచి వస్తున్నాయో తెలిసినా ఆ డీలర్పై 6ఏ కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, వారి షాడోలు రేషన్ మాఫియా లీడర్లుగా వ్యవహరిస్తూ నెలవారీగా వాటాలు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు ఇచ్చుకోవడం అక్రమ రవాణాపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
సంగం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతోపాటు వాహనాన్ని శుక్రవారం సంగం వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై వాహనంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వాహనాన్ని సంగం పోలీసులు వెంబడించారు. బుచ్చి టోల్ ప్లాజా మధ్యలో పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చేజర్ల మండలం నాగులవెల్లటూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెం సమీపంలో ఉన్న ఓ రైస్మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి విచారణ చేపట్టి దోషులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

డీలర్ టు మిల్లర్