
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): పుంగనూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తిరుపతిలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డితో చంద్రశేఖర్రెడ్డి పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
కాకాణి బెయిల్ పిటిషన్ 16కు వాయిదా
నెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగించడానికి ఈ నెల 16కు వాయిదా వేస్తూ నెల్లూరు 5వ అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ కోర్టులో తమ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు పూర్తి కాలేదని, మరికొన్ని వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు న్యాయమూర్తి సరస్వతి బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగింపును సోమవారానికి వాయిదా వేశారు.
ఫారెస్ట్ బీట్ అధికారి సస్పెన్షన్
ఉదయగిరి: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని శకునాలపల్లి అటవీ బీట్ అధికారి పి.భానుతేజను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీశాఖాధికారి కదిరి మహబూబ్బాషా ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రేంజ్ అధికారి కుమారరాజా ఆ ఉత్తర్వు ప్రతిని భానుతేజకు అందజేశారు. శకునాలపల్లి అటవీ బీట్లో అక్రమంగా జామాయిల్ నరికి సొంతంగా అమ్మకొని నగదు కాజేసిన విషయమై స్థానిక వనసంరక్షణ సమితి సభ్యులు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో జిల్లా అధికారి అదేశాల మేరకు రేంజ్ అధికారి విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు పంపారు. దీంతో భానుతేజను సస్పెండ్ చేశారు. కొత్తపల్లి బీట్ అఽధికారి చిన్నప్పరెడ్డిని శకునాలపల్లి బీట్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరొకరికి కరోనా
నెల్లూరు (అర్బన్): జిల్లాలో మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. నగరానికి చెందిన 30 ఏళ్ల యువకుడు జ్వరం, జలుబు, గొంతు సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ కరోనా పరీక్ష చేయగా శుక్రవారం కోవిడ్ నిర్ధారణ అయింది. అతనికి కూడా స్వల్ప లక్షణాలుండటంతో హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇప్పటి వరకు జిల్లాలో 12 కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో ఎక్కడ చూసినా జ్వరాలు ఎక్కువగా ప్రబలి ఉన్నాయి. ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే మరిన్ని కరోనా కేసులు నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా వైద్యశాఖ పరీక్షలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి