
కొనసాగుతున్న టీచర్ల బదిలీలు
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తిష్ట వేశారు. పాయింట్లు, ప్లేస్ చూపకపోవడం వంటి సమస్యలపై పోటా పోటీగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కు తరుచూ అంతరాయం కలుగుతోంది. బదిలీ జరుగుతున్న జెడ్పీ పాఠశాలలో తగినన్ని బల్లలు, కుర్చీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు వరండాల్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. బదిలీల ప్రక్రియ ప్రతి రోజూ రాత్రి పొద్దుపోయే వరకు జరుగుతుండడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ అసిస్టెంట్లకు సంబంధించి క్లస్టర్ వేకెన్సీలు కేటాయించకపోవడంతో వారికి అన్యాయం జరిగిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. లాంగ్వేజ్ పండిట్లకు అన్యాయం జరుగుతుందంటూ ఎక్కువ సంఖ్యలో పండిట్లు ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్పీ తెలుగు, హిందీ సబ్జెక్ట్లకు సంబంధించి జిల్లాలో ఉన్న 95 శాతం ఖాళీలను గూడూరు డివిజన్లో చూపించారని ఆవేద న వ్యక్తం చేశారు. కావలి, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు సంబంధించి ప్రతి మండలంలో 3 ఖాళీలను అదనంగా చూపించి న్యాయం చేయాలని కోరారు.
ఓ పక్క బదిలీలు, మరో పక్క తరగతులు
స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ గందరగోళంగా మారింది. ఒక పక్క బదిలీలు జరుగుతుండడంతో ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఉపాధ్యాయులతోపాటు ఆయా యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మరో పక్క పాఠశాలల పునః ప్రారంభం కావడంతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. బదిలీల జరుగుతున్న నేపథ్యంలో అన్యాయం జరిగిందంటే ఉపాధ్యాయులతోపాటు యూనియన్ సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది.
కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు మోహరింపు
చిన్నచిన్న సమస్యలపై అభ్యంతరాలు
బదిలీ ప్రక్రియకు అవాంతరాలతో జాప్యం