తాళం వేస్తే.. ఇల్లు గుల్లే | - | Sakshi
Sakshi News home page

తాళం వేస్తే.. ఇల్లు గుల్లే

Apr 19 2025 12:24 AM | Updated on Apr 19 2025 12:24 AM

తాళం

తాళం వేస్తే.. ఇల్లు గుల్లే

నెల్లూరు(క్రైమ్‌): పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు విజృంభిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనానికి కాదేది అనర్హమంటూ దేవాలయాలు, బడులను సైతం వదలకుండా అందినకాడికి దోచేస్తున్నారు. కొందరి నిర్లక్ష్యమూ దొంగలకు కలిసొస్తోంది. జిల్లాలో ఐదు సబ్‌డివిజన్లు, 12 సర్కిల్స్‌ పరిధిలో 52 పోలీస్‌స్టేషన్లు, 11 అర్బన్‌ పోలీస్‌స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో రోజూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, దొంగతనాలను కట్టడి చేయాలని జిల్లా పోలీస్‌ బాస్‌ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆయన ఆదేశాల అమలు నామమాత్రంగానే ఉంది. క్రైమ్‌పార్టీలూ మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యాయి. ఇదే అదునుగా భావిస్తున్న దుండగులు అందినకాడికి దోచేస్తున్నారు. చిన్నపాటి ఆధారం దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు సైతం జిల్లాలో తలదాచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నాయి. గొలుసు దొంగతనాలు పెరుగుతున్నాయి. నెలన్నర వ్యవధిలో రూ.1.50 కోట్లకు పైగా సొత్తును దుండగులు అపహరించారు. తాజాగా కావలిలో పట్టపగలే దొంగలు విజృంభించారు.

ఇలా చేస్తే..

ప్రజలు ఇళ్లు విడిచి బయటకు వెళ్లే సమయంలో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచరాదు. తెలిసిన వారిని ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. కుదరని పక్షంలో దొంగతనాల నియంత్రణకు పోలీస్‌ శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ సేవలను వినియోగించుకోవాలి. చాలా సందర్భాల్లో పోలీస్‌ అధికారులు సూచనలిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం దొంగతనాలు జరిగేందుకు ఆస్కారమవుతోంది.

పోలీసులూ స్పందించాలి

పోలీస్‌ అధికారులు నేరాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల పరిధిలో విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచాలి. పగలు, రాత్రి బీట్లను పటిష్టంగా అమలు చేయాలి. పాతనేరస్తులతోపాటు జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడున్నారు?, ఏం చేస్తున్నారు? అనే వివరాలు సేకరించి వారి కదలికలపై నిఘా ఉంచాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నారా? అనే సమాచారాన్ని తెలుసుకోవాలి. నిరంతర వాహన తనిఖీలు నిర్వహించాలి. శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో గస్తీని పెంచాలి. దొంగతనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలనూ భాగస్వాములను చేయడం ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసులకు, 112కు సమాచారం అందించాలి.

నెలన్నర వ్యవధిలో..

జిల్లాలో పెరిగిన చోరీలు

నిర్లక్ష్యమూ కొంతమేర కారణమే..

నెలన్నర వ్యవధిలో

రూ.1.50 కోట్లకు పైగా అపహరణ

వరుస ఘటనలతో జనం బెంబేలు

కావలి పట్టణంలోని నాలుగు గృహాల్లో సుమారు 59 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.55 వేల నగదు, 750 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు.

కందుకూరు పట్టణం వాసవీనగర్‌లో తాళం వేసిన ఇంట్లో 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదు, కొంత వెండి చోరీ చేశారు.

నారాయణ ఆస్పత్రి ప్రాంగణంలోని వైద్యుల క్వార్టర్స్‌లో 9 సవర్ల బంగారం, ఒకట్నిర కేజీ వెండి వస్తువులు, రూ.20 వేల నగదు దోచేశారు.

ఆత్మకూరు పట్టణంలో రమణమూర్తి అనే వ్యక్తి బ్యాగ్‌లోని 100 గ్రాముల బంగారం, వెండిని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు.

దుత్తలూరులో నరేష్‌ అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు 11 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

బుజబుబజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో రాజ్‌కిశోర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10 సవర్ల బంగారు ఆభరణాల చోరీ జరిగింది.

తాళం వేస్తే.. ఇల్లు గుల్లే 1
1/1

తాళం వేస్తే.. ఇల్లు గుల్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement