
మళ్లీ అదే నిర్లక్ష్యం.. చిన్నచూపు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకునేందుకు బాటలు వేసింది. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పరిమితమైన ఎన్నో సౌకర్యాలను సర్కారు బడుల్లో కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు తలకిందులయ్యాయి. డిజిటల్ విద్యకు మంగళం పాడే దిశగా అడుగులేస్తోంది. పేద పిల్లలు చదివే స్కూళ్లను బలహీనపరిచి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పెద్దపీట వేస్తోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
నెల్లూరు(టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు డిజిటల్ విద్యను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లో తొలివిడతలో 1,324 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ)లు, 428 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీలు, 6 నుంచి 10వ తరగతి వరకు ఐఎఫ్పీల ద్వారా విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. ఇంకా 8వ తరగతి విద్యార్థులకు 2022 – 23 విద్యా సంవత్సరంలో 18,513 ట్యాబ్లు, 2023 – 24లో 17,748 ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేశారు. బోధించే టీచర్లకు కూడా వాటిని అందించారు. ట్యాబ్లలో బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేశారు. విద్యార్థి తరగతి గదిలో విన్న తర్వాత ఇంటికెళ్లి ఒకసారి ట్యాబ్లో మళ్లీ చదువుకునే విధంగా అవకాశం కల్పించారు. ఇంకా జిల్లాలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేశారు. పోటీ పరీక్షల్లో రాణించేలా బోధన అందించేలా చర్యలు చేపట్టారు. ఇంకా 30 హైస్కూ ల్ ప్లస్లను ఏర్పాటు చేసి ఇంటర్ విద్యను అమలు చేశారు. విద్యార్థులకు 8వ తరగతి నుంచే సీబీఎస్ఈ సిలబస్నే బోధనను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం ఆ పద్ధతిలో పది పరీక్షలు రాయాల్సి ఉంది. టోఫెల్ పరీక్ష విధానంలో కూడా శిక్షణ ఇచ్చారు.
రద్దు దిశగా..
గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీబీఎస్ సిలబస్ను రద్దు చేసి పది పరీక్షలను రాష్ట్ర సిలబస్తోనే రాయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఇంగ్లిష్ మీడియంలోనే జరుగుతున్న పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరం ఏ మీడియంలోనైనా రాయొచ్చని చెప్పింది. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే సాకుతో హైస్కూల్ ప్లస్లను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో బోధిస్తున్న విధానానికి చెక్ పెట్టనున్నారు. హైస్కూల్ స్థాయి నుంచి ఈ విధానాన్ని తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. టోఫెల్ పరీక్ష విధానాన్ని రద్దు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే పిల్లల దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని పాడైనా మరమ్మతులు చేయడం లేదు. జిల్లాలో మిగిలిన పాఠశాలల్లో ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రభుత్వ బడులపై నిర్లక్ష్యం చేస్తారనే మాట ఉంది. దీనిని రుజువు చేసేలా కార్పొరేట్కు కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వంపై పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు.
ట్యాబ్లు, ఐఎఫ్పీలు ఇంకా రాలేదు
ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇంకా రాలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన పాఠశాలలకు ఐఎఫ్పీలు రావాల్సి ఉంది. అవి కూడా ఇంకా రాలేదు. స్మార్ట్ టీవీలపై ఎలాంటి సమాచారం లేదు. సీబీఎస్ఈ చదువుతున్న విద్యార్థులకు ఇటీవల ఒక టెస్ట్ నిర్వహించారు. ఈ ఫలితాల్లో మెరుగ్గా లేరని సీబీఎస్ఈలో పరీక్ష విధానాన్ని రద్దు చేసి స్టేట్ సిలబస్లోనే రాయాలని ఆదేశాలొచ్చాయి.
– బాలాజీరావు, డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని
గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
వైఎస్సార్సీపీ హయాంలో
విప్లవాత్మక మార్పులు
డిజిటల్ విద్యకు పెద్దపీట
నేడు ఒక్కొక్కటిగా మాయం
విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వని వైనం

మళ్లీ అదే నిర్లక్ష్యం.. చిన్నచూపు