
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ తమిళనాడు స్టార్ క్రికెటర్ ఇంగ్లండ్ కౌంటీల్లో మరోసారి ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్, సర్రేతో జరిగే చివరి రెండు హాంప్షైర్ మ్యాచ్ల్లో సుందర్ భాగం కానున్నాడు. ఈ విషయాన్ని హాంప్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మా చివరి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
వెలకమ్ వాషీ" అంటూ హాంప్షైర్ ఓ పోస్ట్ చేసింది. సుందర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడడం ఇది రెండో సారి. ఇంతకుముందు లంకాషైర్ క్రికెట్ క్లబ్ తరపున సుందర్ ఆడాడు. ఈ రెండు కౌంటీ మ్యాచ్లు (15 సెప్టెంబర్ వర్సెస్ సొమర్సెట్, 24 సెప్టెంబర్ వర్సెస్ సర్రే) వెస్టిండీస్ సిరీస్కు ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది.
వాస్తవానికి స్వదేశంలో ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరపున వాషీ ఆడుతాడని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం సుందర్కు ఛాన్స్ ఇవ్వలేదు. మానవ్ సుతార్, తనుష్ కోటియన్, హర్ష్ దుబే వంటి యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు అవకాశమిచ్చారు.
కాగా ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టూర్లో సుందర్ ఏడు వికెట్లు, 284 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో కూడా మొత్తంగా 16 వికెట్లు సాధించాడు. ఇప్పుడు సుందర్ తిరిగి విండీస్తో సిరీస్లో ఆడనున్నాడు. భారత్-విండీస్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.