ఆసియా గేమ్స్లో పాల్గొనాలన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్కు సంబంధించి నిర్వహిస్తున్న పోటీల్లో వినేశ్ సెమీస్లో ఓటమిపాలయ్యింది. శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్లో వినేశ్ ఫొగాట్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరాజయం చవిచూసింది.
ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించడంతో పాటు క్రీడలకు దూరమైంది. ట్రయల్స్లో బాగా రాణించి.. అంతర్జా తీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రేక్ పడినట్లయింది.
గత మ్యాచ్లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన వినేశ్ అక్కడి పోరాటంలో విజయం సాధించినప్పటికీ, తాజాగా సెమీస్లో ఓటమి పాలవ్వడంతో రెజ్లింగ్లో మాత్రం పరాజయం తప్పలేదు.
ట్రయల్స్లో ఓటమి అనంతరం వినేశ్ ఫొగాట్ స్పందించింది. నేను ఓడిపోలేదు. ఈ వ్యవస్థతో ఒంటరిపోరాటం చేస్తున్నా. ప్రతిదాని కోసం పోరాడాల్సి వస్తోంది. నాకు న్యాయం జరగలేదు. మళ్లీ తిరిగి వస్తాను. రెజ్లర్ వినేశ్కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.


