సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. టి20 ప్రపంచకప్లో భారత జట్టు టైటిల్ సాధించిన తర్వాత తిలక్ వర్మ సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా తిలక్ను జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలుసుకున్న సీఎం రేవంత్ శాలువాతో సన్మానించి అభినందించారు.
ఇదే కార్యక్రమంలో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ను కూడా సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజహరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.


