ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జావెలిన్ త్రో
బెంగళూరు: భారత స్టార్ పారాథ్లెట్ సుమిత్ అంటిల్... తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో సుమిత్ ఈ ఘనత సాధించాడు.
ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భాగంగా 27 ఏళ్ల సుమిత్ జావెలిన్ను 74.82 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. 2020 టోక్యో, 2024 పారిస్ పారాలింపిక్స్లో పసిడి పతకాలు సాధించిన ఈ హరియాణా త్రోయర్... 2022 ఆసియా పారా క్రీడల్లో 73.29 మీటర్ల దూరంతో ప్రపంచ రికార్డు సృష్టించగా... దాన్ని తాజాగా సవరించాడు.
2023, 2024, 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో టైటిల్స్ గెలిచిన సుమిత్... 80 మీటర్ల మార్క్ అందుకునే దిశగా సాధన కొనసాగిస్తున్నాడు. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుమిత్... అంతకుముందు రెజ్లింగ్ చేసేవాడు. గాయం అనంతరం అతడు పారాథ్లెటిక్స్లో అడుగుపెట్టి సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో వరుస పతకాలతో ఆకట్టుకుంటున్నాడు.


