న్యూఢిల్లీ: ఐపీఎల్లో సారథిగా శ్రేయస్ అయ్యర్ రెండో టైటిల్ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్ ‘అవుట్ ఆర్ నాటౌట్’ కార్యక్రమంలో అయ్యర్ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు.
‘శ్రేయస్ అయ్యర్ మరో సీజన్లో తన టీమ్ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్కతా, పంజాబ్... ఎక్కడ కెప్టెన్గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్ల సరసన శ్రేయస్ చేరతాడు’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.


