సెలెక్షన్‌ ట్రయల్స్‌కు సైనా దూరం

Saina Nehwal to skip trials for Asian Mixed Team Championships - Sakshi

నేడు ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌

చాంపియన్‌షిప్‌ కోసం భారత జట్టు ఎంపిక  

న్యూఢిల్లీ: వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు ఈరోజు సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ర్యాంకింగ్‌ ఆధారంగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధును నేరుగా జట్టులో ఎంపిక చేయగా... రెండో బెర్త్‌ కోసం సైనా నెహ్వాల్, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లను భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సెలెక్షన్‌ ట్రయల్స్‌కు ఆహ్వానించింది. అయితే తాము సెలెక్షన్‌ ట్రయల్స్‌కు హాజరు కాలేమని సైనా, మాళవిక ‘బాయ్‌’కు సమాచారం ఇచ్చారు.

సైనా, మాళవిక వైదొలిగిన నేపథ్యంలో ఈ ట్రయల్స్‌కు అష్మిత చాలియాను ‘బాయ్‌’ ఎంపిక చేసింది. అష్మిత, ఆకర్షి మధ్య జరిగే ట్రయల్స్‌ మ్యాచ్‌లో గెలిచిన వారికి జట్టులో రెండో సింగిల్స్‌ ప్లేయర్‌గా స్థానం లభిస్తుంది. 32 ఏళ్ల సైనా గత ఏడాది 14 అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని ఒక్క దాంట్లోనూ క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయింది. ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి 14 మంది బరిలోకి దిగనున్నారు. ర్యాంకింగ్‌ ఆధారంగా పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌... పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలను నేరుగా జట్టులోకి ఎంపిక చేశారు. మిగతా బెర్త్‌ల కోసం నేడు ట్రయల్స్‌ను ఏర్పాటు చేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top