ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు మద్దతు: మంత్రి కేటీఆర్‌

RuPay Prime Volleyball League Official Match Ball Presented to KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ నిర్వహణకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్‌) నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లీగ్‌కు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీఈఓ జాయ్‌ భట్టాచార్య, బేస్‌లైన్‌ వెంచర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తుహిన్‌ మిశ్రా, హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ ప్రిన్సిపల్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిసి ఈ లీగ్‌ మ్యాచ్‌ బాల్‌ను, హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు జెర్సీని ఆయనకు అందజేశారు.

ఈనెల 5 నుంచి 27 వరకు ఏడు జట్ల మధ్య గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఈ లీగ్‌ జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు సహ యజమాని శ్యామ్‌ గోపు, బెంగళూరు టార్పెడోస్‌ సహ యజమాని యశ్వంత్‌ బియ్యాల తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top