క్వార్టర్‌ ఫైనల్లో రుబ్లెవ్‌  | Rublev in the quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో రుబ్లెవ్‌ 

Jul 10 2023 2:08 AM | Updated on Jul 10 2023 2:08 AM

Rublev in the quarter finals - Sakshi

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) తన కెరీర్‌లో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుబ్లెవ్‌ 7–5, 6–3, 6–7 (6/8), 6–7 (5/7), 6–4తో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రుబ్లెవ్‌ 21 ఏస్‌లు, బుబ్లిక్‌ 39 ఏస్‌లు సంధించడం విశేషం.

మూడో సెట్‌ టైబ్రేక్‌లో మ్యాచ్‌ పాయింట్‌ చేజార్చుకున్న రుబ్లెవ్‌ చివరకు ఐదో సెట్‌లో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో 26వ సీడ్‌ షపోవలోవ్‌ (కెనడా) 6–3, 3–6, 1–6, 3–6తో సఫీయులిన్‌ (రష్యా) చేతిలో ఓడిపోగా... ఎనిమిదో సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) 7–6 (7/4), 6–4, 6–3తో గలాన్‌ (కొలంబియా)పై గెలిచాడు. మూడో రౌండ్‌లో పదో సీడ్‌ టియాఫో (అమెరికా) 2–6, 3–6, 2–6తో దిమిత్రోవ్‌ (బల్గేరియా) చేతిలో ఓటమి చవిచూశాడు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ పెగూలా (అమెరికా) 6–1, 6–3తో సురెంకో (ఉక్రెయిన్‌)పై, వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌) 2–6, 6–4, 6–3తో బుజ్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌లో మిరా ఆండ్రీవా (రష్యా) 6–2, 7–5తో పొటపోవా (రష్యా)పై నెగ్గింది. 

పోరాడి ఓడిన సాకేత్‌–యూకీ జోడీ  
పురుషుల డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌), జీవన్‌ నెడుంజెళియన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. సాకేత్‌–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్‌)–మనారినో (ఫ్రాన్స్‌) జంట చేతిలో... బాలాజీ–జీవన్‌ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్‌ (క్రొయేషియా)–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న (భారత్‌)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్‌ (క్రొయేషియా)–లతీషా చాన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడింది.    

Advertisement
 
Advertisement
Advertisement