
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్లతో కలిసి రోహిత్ ఎయిర్పోర్టులో ప్రవేశించాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపాడు హిట్మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.
అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.
ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం.
అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు.