ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 12) వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్కు ముందు రోహిత్కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 6 పరుగులు కావాల్సి ఉన్నాయి. జేకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లోపుల్ షాట్తో సిక్సర్ కొట్టి ఈ ఘనత (231వ మ్యాచ్) సాధించాడు. ఈ మ్యాచ్లో 13 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ- 6002 (2 సెంచరీలు/40 అర్ద సెంచరీలు)
సూర్యకుమార్ యాదవ్- 3776 (2/29)
కీరన్ పొలార్డ్- 3412 (0/16)
అంబటి రాయుడు- 2416 (0/14)
సచిన్ టెండూల్కర్- 2334 (1/13)
ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్తో కలిపి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ చేసిన పరుగులు..
- 240 మ్యాచ్ల్లో 6275 పరుగులు.
- రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (3915), పొలార్డ్ (3823) ఉన్నారు.
విరాట్ కోహ్లీతో పోలిక
- ఐపీఎల్లో ఒకే జట్టుకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
- విరాట్ ఆర్సీబీ తరఫున 271 మ్యాచ్ల్లో 8840 పరుగులు చేశారు.
- IPL + CLT20 కలిపి 9264 పరుగులు చేశారు.
ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చారిత్రక మైలురాయిని తాకినా, ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 222 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1) అద్భుత ప్రదర్శనలు చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశారు.


