ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
అయితే 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్రైజర్స్ను హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ తలా రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు.
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్..
ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే మిచెల్ మార్ష్(14) వికెట్ను కోల్పోయింది. అయితే ఐడైన్ మార్క్రమ్(45), కెప్టెన్ రిషబ్ పంత్(68 నాటౌట్) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మార్క్రమ్ ఔటైనప్పటికి.. పంత్ మాత్రం అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 19.5 ఓవర్లలో టార్గెట్ను లక్నో చేధించింది.
ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే రెండు వికెట్లు సాధించగా.. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. అయితే సీనియర్ పేసర్ జయ్దేవ్ ఉనద్కట్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఉనద్కట్ 3.5 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో ఉనద్కట్ తేలిపోయాడు. ఎస్ఆర్హెచ్కు ఇది రెండో ఓటమి.
చదవండి: IPL 2026: సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది


