సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌! | Ravichandran Ashwin Predicts Sanju Samson Will Lead Chennai Super Kings | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌.. అశ్విన్ జోస్యం!

Apr 18 2026 7:15 PM | Updated on Apr 18 2026 7:52 PM

Ravichandran Ashwin Predicts Sanju Samson Will Lead Chennai Super Kings

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆరంభంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి సీఎస్‌కే గాడిన ప‌డింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సీఎస్‌కే కెప్టెన్సీ విష‌య‌మై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

సంజూ శాంస‌న్ సీఎస్‌కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. అది ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక‌వేళ ఈ సీజ‌న్‌లో కాకపోయినా భ‌విష్య‌త్తులో మాత్రం శాంస‌న్ సీఎస్‌కేను శాసిస్తాడ‌ని జోస్యం చెప్పాడు. ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సీఎస్‌కేకు కెప్టెన్సీ అనుభ‌వం ఉన్న ఆట‌గాడు అవ‌స‌రమ‌ని, ఈ విష‌యంలో సీఎస్‌కేకు మొద‌టి చాయిస్ సంజూనే అని తెలిపాడు. 

ఇప్ప‌టికే సంజూ శాంస‌న్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఫైన‌ల్ చేర్చిన‌ట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్‌కే యాజ‌మాన్యం ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే రుతురాజ్‌ను త‌ప్పించి శాంస‌న్‌కు బాధ్య‌త‌లు అప్పగించినా ఆశ్చ‌ర్చ‌పోన‌వ‌స‌రం లేద‌ని తెలిపాడు. ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న రుతురాజ్ ఈ సీజ‌న్‌లోనే కెప్టెన్సీ వ‌దిలేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని జోస్యం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం అశ్విన్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఇక ఎంఎస్ ధోని సార‌ధ్యంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక సీఎస్‌కే ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు. ధోని త‌ర్వాత కెప్టెన్లు ఎంద‌రు మారినా సీఎస్‌కే మ‌రో టైటిల్ కొట్ట‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యింది. 

2022 సీజ‌న్‌లో ధోని స్థానంలో ర‌వీంద్ర జ‌డేజాను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని త‌ట్టుకోలేక జ‌డేజా దానిని మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు. దీంతో గత్యంత‌రం లేక మ‌ళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అలా 2023 సీజ‌న్‌లోనూ సీఎస్‌కేను న‌డిపించిన ధోని ఐదోసారి చాంపియ‌న్‌గా నిలిపాడు. 

ఆ త‌ర్వాత 2024 సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ ఆ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేర‌డంలో విఫ‌ల‌మైంది. ఇక 2025 సీజ‌న్‌లో రుతురాజ్ సార‌థ్యంలోని సీఎస్‌కే దారుణ ఆట‌తీరుతో అట్ట‌డుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌!

Advertisement
 
Advertisement
Advertisement