
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలోని సమ్టర్ పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 335వ ర్యాంకర్ రష్మిక 3–6, 6–3, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 212వ ర్యాంకర్ హనా చాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది.
2 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఒక ఏస్ కొట్టి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన జూలియా ఫ్లిగ్నెర్తో రష్మిక తలపడుతుంది. డబుల్స్లో రష్మిక (భారత్)–కేథరీన్ సెబోవ్ (కెనడా) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్లో రష్మిక–కేథరీన్ ద్వయం 7–6 (8/6), 6–4తో అయానా అక్లి–డలేనా హెవిట్ (అమెరికా) జోడీపై గెలిచింది.