కోహ్లీ, పాటీదార్‌ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వ‌ల్లే! | Rajat Patidar Won Titles-Dont Forget-Smriti Mandhana Changed RCB Fate | Sakshi
Sakshi News home page

కోహ్లీ, పాటీదార్‌ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వ‌ల్లే!

Jun 2 2026 4:51 PM | Updated on Jun 2 2026 5:15 PM

Rajat Patidar Won Titles-Dont Forget-Smriti Mandhana Changed RCB Fate

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్‌గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా క‌ప్ న‌మ్‌దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురుచూసింది. అప్ప‌టికీ మూడుసార్లు ఫైన‌ల్ చేరినా తుది మెట్టుపై బోల్తా ప‌డ‌డంతో ఇక ఆర్సీబీ టైటిల్ క‌ల క‌ష్ట‌మే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు.

కానీ 17 ఏళ్లలో ద‌క్క‌ని టైటిల్ గ‌తేడాది త‌మ చెంత చేర‌డంతో ఆర్సీబీ ఉబ్బిత‌బ్బిబ్బైపోయింది. ఈ సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్సీబీ రెండోసారి క‌ప్ ఒడిసిప‌ట్టడంతో ర‌జ‌త్ పాటీదార్ ల‌క్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వ‌రుస‌గా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్‌గా పాటీదార్ నిలిచాడు. ఈ క్ర‌మంలో పాటీదార్‌ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన‌ ల‌క్కీ కెప్టెన్‌ అని పొగుడుతున్నారు.

కానీ ఆర్సీబీ రాత అంత‌కుముందే మారింద‌ని కొంత‌మంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జ‌ట్టు టైటిల్ సాధించ‌ డానికి ముందే మ‌హిళ‌ల జ‌ట్టు ఆ ఘ‌న‌త సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది.  అయితే 2023లో మొద‌లైన‌ డ‌బ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓట‌మిబాట‌లోనే న‌డిచింది. ఆ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. 

దీంతో పురుషుల జ‌ట్టు మాదిరే మ‌హిళ‌ల జ‌ట్టు కూడా ట్రోలింగ్‌కు గురైంది. అయితే మ‌రుస‌టి సీజ‌న్‌లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ సీజ‌న్ ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్‌గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజ‌న్‌లో టైటిల్ సాధించ‌డంలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, 2026 సీజ‌న్‌లో మ‌రోసారి ఆర్సీబీ మహిళ‌ల జ‌ట్టు చాంపియ‌న్‌గా నిలిచింది. 

ముఖ్యంగా కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా మంధాన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో మంధాన 41 బంతుల్లోనే 87 ప‌రుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో క‌ప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియ‌న్‌గా నిల‌వ‌గ‌ల‌ద‌ని మంధాన బ‌హిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చింది. 

మ‌హిళల జ‌ట్టును ఆద‌ర్శంగా తీసుకున్న పురుషుల జ‌ట్టు లెగ‌సీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వ‌రుస‌గా రెండోసారి చాంపియ‌న్‌గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన‌ మ‌హిళ‌ల జ‌ట్టు డ‌బ్ల్యూపీఎల్‌లో.. పురుషుల జ‌ట్టు ఐపీఎల్‌లో వ‌రుస టైటిల్స్ సాధించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఆర్సీబీని మార్చిన‌ కోహ్లీ సందేశం..


2023 డ‌బ్ల్యూపీఎల్‌లో వైఫ‌ల్యం త‌ర్వాత ఆర్సీబీ మ‌హిళ‌ల జ‌ట్టుతో కోహ్లీ ప్ర‌త్యేకంగా మాట్లాడాడు. ఈ నేప‌థ్యంలో మ‌హిళల‌ జ‌ట్టుకు 'ఫ‌లితం కోసం ఆశించ‌కుండా 110 శాతం క‌ష్ట‌ప‌డండి' అంటూ కోహ్లీ త‌న మోటివేష‌న్ స్పీచ్‌తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న మంధాన సేన 2024 సీజ‌న్‌లో టైటిల్‌ను సాధించింది. ఆర్సీబీ త‌ల‌రాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫ‌న్నీ పోస్టులు పెడుతున్నారు.

చదవండి: ష‌కీరా కూడా ప‌నికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట!

Advertisement
 
Advertisement
Advertisement