హోర్సెన్స్ (డెన్మార్క్): భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కౌన్సిల్ సభ్యురాలిగా ఆమె కొత్త పాత్రలో కనిపించనుంది. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్లోకి ఎంపిక కావడంతోనే సింధు అడుగులు ఈ వైపు పడ్డాయి.
అయితే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఆమెకు అధికారికంగా గుర్తింపు లభించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ప్రస్తుతం చురుగ్గా ఆడుతూనే ఈ తరహాలో ఓటు హక్కుతో సహా పరిపాలన బృందంలో భాగం కావడం సింధు ఎంపికను ప్రత్యేకంగా మార్చింది.
ఇక శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో సింధు తన కొత్త హోదాలో పాల్గొనడం విశేషం. ప్లేయర్ల తరఫున ఆమె ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఇకపై జరిగే బీడబ్ల్యూఎఫ్ అధికారిక సమావేశాలు, చర్చల్లో పాల్గొని సింధు షట్లర్ల తరఫున తగు సూచనలిస్తూ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది.
‘బీడబ్ల్యూఎఫ్లో ఇంత పెద్ద బాధ్యతను తీసుకొని ఆటగాళ్లను ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. బ్యాడ్మింటన్ నాకు ఎంతో ఇచ్చింది. నా వైపునుంచి ఆటకు ఉపయోగపడే అవకాశం రావడం అదృష్టం’ అని సింధు వ్యాఖ్యానించింది.


