సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ గనగామ నైశిక్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నైశిక్ 7–6 (7/4), 6–4తో టాప్ సీడ్ ప్రసాద్ ఇంగాలె (మహారాష్ట్ర)ను బోల్తా కొట్టించాడు.
సెమీఫైనల్లో నైశిక్ 7–6 (7/5), 6–2తో మహదేవ్ బంగార్గి (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ముకేశ్ చావ్డా (గుజరాత్)పై గెలుపొందాడు. విజేత నైశిక్కు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ విన్నర్స్ ట్రోఫీ అందజేశారు. హైదరాబాద్లో జాతీయ గ్రాస్కోర్టు మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ, కాజా వినాయక్ శర్మ, ఒలింపియన్ విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నైశిక్ శిక్షణ తీసుకుంటున్నాడు.


