భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్కప్ 2026కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడు సాధారణ టికెట్ను రూ. 25000కి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
సోధా మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2026 భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి, వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను, ఓవరాల్గా మూడో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. సూపర్-8లో సౌతాఫ్రికా మినహా జింబాబ్వే, వెస్టిండీస్పై అద్భుత విజయాలు సాధించి, సెమీస్కు చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి ఫైనల్కు చేరింది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టి20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.


