
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తమ జైత్ర యాత్ర కొనసాగుతోంది. హార్దిక్ సేన వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు.
ముంబై సరికొత్త చరిత్ర..
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో 150 మ్యాచ్ల్లో గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు 271 మ్యాచ్లు ఆడిన ముంబై 150 విజయాలు సాధించింది. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్దానంలో సూపర్ కింగ్స్ (248 మ్యాచ్లు) ఉంది. మూడు నాలుగు స్ధానాల్లో కేకేఆర్(134), ఆర్సీబీ(129) కొనసాగుతున్నాయి.
చదవండి: నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది.. అది మర్చిపోతే ఎలా?!: కోహ్లి కౌంటర్