పాకిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గైర్హజరీలో స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్కు జట్టు పగ్గాలను ఆసీస్ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే ఇప్పుడు వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగా మార్ష్కు కూడా విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాక్ పర్యటనలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ బదులుగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ నడిపించనున్నట్లు సమాచారం. ఇంగ్లిష్కు జాతీయ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇంగ్లిష్ తొలిసారిగా 2024లో పాకిస్తాన్తో జరిగిన వైట్-బాల్ సిరీస్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ చేశాడు.
రెగ్యులర్ కెప్టెన్లు పాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్లకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లిష్ను ఆస్ట్రేలియా సెలక్టర్లు పరిగణిస్తున్నారు. అతడు భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు రెగ్యులర్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఇంగ్లిష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అద్భుతంగా రాణించాడు. వ్యక్తిగత కారణాలతో తొలి హాఫ్ సీజన్కు దూరమైన ఇంగ్లిష్.. సెకెండ్ హాఫ్లో మాత్రం దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును పాక్ గడ్డపై కొనసాగించేందుకు జోష్ సిద్దమయ్యాడు. ఇక పాక్-ఆసీస్ వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది.
పాక్తో మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపా
చదవండి: ఆకలి, కసి: శ్రేయస్ అయ్యర్ పోస్ట్ వైరల్!


