
2018లో అవకాశం రాకపోవడంపై కరుణ్ నాయర్
లీడ్స్: భారత జట్టు 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ను 1–4తో కోల్పోయింది. నాలుగో టెస్టు ముగిసేసరికే ఇంగ్లండ్ 3–1తో సిరీస్ను సొంతం చేసుకుంది. టూర్లో ఆరంభం నుంచి ఉన్న కరుణ్ నాయర్కు నాలుగు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. సిరీస్ ఫలితం ఖాయమైన నేపథ్యంలో కనీసం చివరి టెస్టులోనైనా చోటు దక్కవచ్చని అతను ఆశించాడు. అయితే కోహ్లి కెప్టెన్, రవిశాస్త్రి కోచ్గా ఉన్న టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఒకవైపు నాయర్ టీమ్తోనే ఉండగా... అసలు ప్రధాన జట్టులోనే లేని హనుమ విహారిని భారత్ నుంచి ఇంగ్లండ్కు రప్పించి అతనితో అరంగేట్రం చేయించింది. దాంతో నాయర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత అతను భారత జట్టుకూ పూర్తిగా దూరమయ్యాడు. నాటి ఘటన తనను తీవ్రంగా బాధించిందని నాయర్ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత అదే ఇంగ్లండ్ గడ్డపైనే అతనికి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రానుండటం విశేషం.
‘చివరి టెస్టులోనూ నాకు అవకాశం లేదని తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మైదానంలోనే కుప్పకూలిపోయినట్లుగా అనిపించింది. నేను ఆడటం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఒంటరితనం ఆవహించింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్లిపోయాను. బ్రాండెడ్ షూస్ మొదలు కనిపించిన ప్రతీ వస్తువును కొంటూ పోయాను. నేను గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు కూడా లేదు.
కానీ ఈసారి ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. బ్యాగుల నిండా వస్తువులు తీసుకొని తిరిగొచ్చాను. ఆ సమయంలో షాపింగ్ చేస్తే నాకు సంతోషం కలుగుతుందేమో అన్నట్లుగా భావించాను కానీ అది అర్థం లేని ఆలోచన. భారత్కు ఆడటం తప్ప మరేదో ఆనందం ఇవ్వలేదని అర్థమైంది. నాకు సంబంధించి సిరీస్ అయిపోయింది. కానీ చివరి మ్యాచ్ ముగిసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనే ఆలోచనలో ప్రతీ రోజు ఒక నరకంగా అనిపించింది’ అని కరుణ్ నాయర్ తన బాధను వ్యక్తీకరించాడు.