తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసఫ్ విజయ్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ (మే 10) ఉదయం ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆథ్వర్యంలో ప్రమాణస్వీకారోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజయ్ సీఎం అవగానే సోషల్మీడియాలో ఓ అంశం వైరలైంది. విజయ్ సీఎం అయ్యాడు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని తమిళులు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడాని ఓ బలమైన కారణముంది.
తమిళనాట ప్రభుత్వాలు మారి, కొత్త సీఎంలు వచ్చినప్పుడు సీఎస్కే టైటిల్ సాధించింది. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు సీఎస్కే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆతర్వాత 2021లో స్టాలిన్ సీఎం అయినప్పుడు కూడా సీఎస్కేనే టైటిల్ సాధించింది. ఇప్పుడు విజయ్ సీఎం అవ్వడంతో సెంటిమెంట్ రిపీటై సీఎస్కే మరోసారి టైటిల్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
వాస్తవానికి ఈ సెంటిమెంట్కు దగ్గరగానే సీఎస్కే ప్రస్తుత పరిస్థితి ఉంది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. సంజూ శాంసన్ ఆ జట్టు తలరాతను మార్చాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో మూడు గెలిచినా, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే.


